August 10, 2009

సంస్కారం కులాన్నిబట్టి వస్తుందా?

విద్య నేర్పే గురువు సాక్షాత్తూ భగవత్ స్వరూపంగా చెపుతారు. అలాంటి భగవత్ స్వరూపమే మా మాస్టారు. ఆజానుబాహుడు. ఎప్పుడూ ఖద్దరు బట్టలే కడతారు. పొడవైన అంగీ, పంచె కట్టు, భుజంపై మువ్వన్నేల రంగుతో ఉండే కండువా, మొఖంలో తేజస్సు, గాంభీర్యం, ఏ విషయాన్నైనా తెలియ చెప్పగల విఙ్నానం ఆయన సొత్తు. చూడగానే చెయ్యెత్తి నమస్కరించాలని అనిపించేలా ఉంటారు. ఆయన చేతిలో ఎప్పుడూ పుస్తకాలుండేవి. అవేమిటో తెలుసుకొనే సాహసం మాకు ఉండేది కాదు. ఆయన క్లాసులోకి వస్తే చాలు పిల్లలందరమూ బుద్ధిమంతులుగా కూర్చుండి పోయేవాళ్ళం. అలాగని మమ్మల్ని ఎప్పుడూ మందలించిన పాపాన కూడా పోలేదు. ఆయన చెప్పేది చాలా శ్రద్ధగా వినేవాళ్ళం. ఆయన చెప్పే విషయాలు చాలా ఆసక్తిగా ఉండేవి. ఊరి పెద్దలలో ఆయన ఒకరు. అనేక సలహాలు సంప్రదింపులు ఆయనతో జరిగేవి. రోడ్డుపై ఆయన నడిచి వెడుతూ ఉంటే గౌరవంతో అందరూ పక్కకు తప్పుకొనే వాళ్ళు. ఇన్ని విశిష్ట లక్షణాలున్న ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడు. వారికి కులాన్ని అంటగట్టి పాపం మూటగట్టుగోవడం నా ఉద్దేశ్యం కాదు. సంస్కారం అనేది కులాన్ని బట్టి రాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. గొప్ప వ్యక్తులకు మతం రంగు, కుల కంపులు అంటవు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. వ్యక్తిత్వం అనేది కేవలం పుస్తకాలు చదవడంవల్ల రాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మర్యాద అనేది అడిగి తీసుకొనేది కాదు అని చెప్పడమే నా ఉద్దేశ్యం. సంఘంలో మనలని ఎవ్వరూ పట్టించుకోరు అనడం బ్రమ అని చెప్పడమే నా ఉద్దేశ్యం. నీ మాటలు, నీ నడవడికే సంఘంలో నీకొక స్థానన్ని కల్పిస్థాయి అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మహాత్మ గాంధీ కూడా జాతి వివక్షను చవి చూశాడు. దానివల్ల ఆయన్లోని నాయకత్వ లక్షణాలు మరింత పెరిగాయికాని నశించి పోలేదు. ఇలాటి ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు!!

సాంఘీకంగా ఏర్పరచుకున్న కట్టుబాట్లని పాటించాలని రాజ్యాంగంలో రాసి లేదు. ఎవరి చిత్తము వచ్చినట్ట్లు వారు నడుచుకోవచ్చు. బ్రాహ్మలు మాంసాహారము తింటానన్నా, మరొకళ్ళు మా సంస్కృతి ప్రకారం గొడ్డు మాంసము తింటానన్నా నిరభ్యంతరంగా తినచ్చు. దొరికితే కుక్క మాంసము కూడా తినొచ్చు. ఈశాన్య ప్రాంతాలలో బంధువులు వచ్చినప్పుడు ప్రత్యేక వంటకంగా కుక్క మాంసమే వండుతారు. నీ స్వేచ్చని కాదనే హక్కు ఎవరికీ లేదు. వండుకు తిన్నా పచ్చిది తిన్నా కూడా కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ నీ అలవాట్లని మరొకరిపై రుద్దటం అనుచితం. నీ స్వేచ్చ నీ వరకే పరిమితం. సాంఘీకంగా సర్వోన్నతుడివి కావాలంటే మాత్రం మెజారిటీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడవాలి. వారి అభిప్రాయాలతో నీకు పని లేనప్పుడు నువ్వెప్పటికీ ఒంటరివే!!

August 6, 2009

నా అభిప్రాయంలో మగధీర.....

మగధీర సినీమాకి చేసినంత పబ్లిసిటీ ఈ మధ్య కాలంలో మరే సినీమాకీ చేయలేదేమో. మెగా స్టార్ తనయుడు, భారీ బడ్జెట్, పేరున్న దర్శకుడు ఇంకా ఇతర అంశాలు ఎన్నో ఈ సినీమా అంటే ఒక ఉత్సుకతని కలిగించాయి.సినీమా రిలీజ్‌కు ముందే ప్రతీ ప్రేక్షకుడు చాలా భారీ స్థాయిని ఊహించాడు. మరి సినీమా చూసిన ప్రేక్షకుడు తాను ఊహించిన స్థాయిలో ఉందని ఒప్పుకున్నాడా? నాలుగు రోజుల క్రితం నేను కూడా ఈ సినీమాని చూసేను. హాలివుడ్ సినీమా "త్రీ హండ్రెడ్" చూసిన ప్రేక్షకులెవరికైనా మగధీర సినీమా చూస్తున్నప్పుడు ఒక షాడో లైన్లా ఒక్కసారి గుర్తుకు వచ్చి ఉండాలి. అలాగే అరుంధతి కూడా. రాజమౌళీ రాంచరణ్‌తో సినిమా తీయడానికి అతనిని చాలా విధాలుగా పరీక్షించి ఉంటాడనిపిస్తోంది. రాంచరణ్ ఒకరకంగా పౌరాణిక పాత్రలకి నప్పినంతగా సాంఘీక పాత్రలకి నప్పకపోవచ్చనిపించింది.కోల మొహం, పొడవైన ముక్కు పౌరాణిక పాత్రలకి చక్కగా నప్పుతాయి. అందువల్లే కధ ఎంపికకి ఫ్లాష్ బేక్‌లో పౌరాణిక కధని ఎంచుకున్నాడు. ఒకరకంగా సినిమా మొదటి భాగంలొ ప్రేక్షకులు కొంత అసంతృప్తికి గురౌతారు. రెండో భాగం మొదలు అయ్యాకా గానీ అసలు కధ మొదలవ్వదు. రెండో భాగంలో భారీ సెట్టింగులు, గ్రాఫిక్స్ ప్రేక్షకులని మెప్పించాయి. రాంచరణ్ రాజ సైనికుడి పాత్రలో ఇమిడిపోయాడు. అతని శరీర ధారుడ్యం కూడా చక్కగ నప్పింది. కాజోల్ కూడా రాకుమారి పాత్రకు చక్కగ నప్పింది. కాని కొన్ని సంఘటనలు మాత్రం కధా పరంగా అవసరం కాకపోయినా ఖర్చుకు వెనకాడకూడదన్నట్టుగా కనిపించాయి. అతిధి పాత్రలో చిరంజీవి కనిపించడం, బంగారు కోడి పెట్ట పాటను మరలా ఎంచుకోవడం కేవలం చిరంజీవి అభిమానులకోసమే. కమర్షియల్‌గా పెట్టిన ఖర్చుకు కొంత గ్యారంటీ ఉండటంకోసమే. టోటల్‌గా సినీమా ఓకే. ప్రతీవాళ్ళూ ఒకసారి చూడవచ్చు.